Sunday, March 22, 2026

ప్రతి క్షణం కోహ్లీ భయ్యానే అండగా ఉన్నాడు: సిరాజ్

టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీకి తాను రుణపడి ఉన్నానని హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ అంటున్నాడు. కెరీర్‌, జీవితంలో ఒడుదొడులు ఎదుర్కొన్నప్పుడు తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. ఆసిస్ పర్యటన సమయంలో తాను తండ్రిని కోల్పోయిన ఆవేదనలో కూరుకుపోయి ఉన్నప్పుడు కోహ్లీనే తనకు కొండంత అండగా నిలిచాడని సిరాజ్ చెప్పాడు. తన కెరీర్లో తొలిసారిగా టీమిండియా తరపున జాతీయ టెస్టు జట్టులోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కోహ్లీ తనకు ఎంతో ధైర్యం చెప్పాడని సిరాజ్ వెల్లడించాడు.

‘సామర్థ్యాన్ని కోహ్లీ భయ్యా ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు. నేను ఎలాంటి పిచ్‌పై అయినా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపగలనని అంటుంటాడు. ఆసీస్ పర్యటనలోనే నేను నా తండ్రిని కోల్పోయాను. నా జీవితంలో తొలిసారి టీమిండియాకు ఆడుతున్నందుకు ఆనందపడాలో, తండ్రిని కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాను. తీవ్ర ఒత్తిడితో మ్యాచ్ ఆడలేనని ఫిక్స్ అయిపోయాను. కన్నీళ్లలో మునిగిపోయాను. అప్పుడే విరాట్‌ నా గదికి వచ్చాడు. నా పరిస్థితి చూసి వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను నీతో ఉన్నాను. ఆందోళన చెందకని ఓదార్చాడు. అతడిచ్చిన స్ఫూర్తితోనే మిగతా సిరీస్‌ మొత్తం ఆడాను. గొప్పగా రాణించాను. తొలి మ్యాచ్ అనంతరం కోహ్లీ భయ్యా ఇండియా వచ్చేసినా.. నాకు ఫోన్ చేస్తూ నాలో ధైర్యం నింపాడం’టూ సిరీజ్ ఉద్వేగంగా చెప్పాడు.

అంతేకాకుండా తన క్రికెట్‌ కెరీర్లోనే కాకుండా.. జీవితంలో కూడా కోహ్లీ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని, అందుకు నిజంగా తానెంతో అదృష్టవంతుడినని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌ను కోహ్లీ భయ్యా ప్రశంసిస్తుంటాడని, తన బౌలింగ్ ఎలాంటి పిచ్‌పై అయినా బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టగలదని అంటుంటాడని సిరాజ్ చెప్పాడు. ఇక తాజాగా బౌలింగ్‌లో తాను చేసుకున్న మార్పులను కూడా ఎంతగానో అభినందించాడని సిరాజ్ వివరించాడు. ‘ఈ మధ్యే సీఎస్‌కే మ్యాచ్‌ తర్వాత విరాట్ భయ్యా నాతో మాట్లాడాడు. నా బౌలింగ్‌లో చేసుకున్న మార్పులు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. జట్టుకు అవి ఉపయోగపడతాయని అన్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధంగా ఉండమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకరి నుంచి అలాంటి మాటలు వస్తే ఎంతో ప్రేరణ కలుగుతుంది’ అని ఈ హైదరాబాదీ పేసర్ గొప్పగా చెప్పగా చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఇండియా జట్టులో సిరీజ్‌ను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. సిరాజ్‌కు ఇది రెండో విదేశీ టోర్నీ. ఇటీవల రద్దయిన ఐపీఎల్ 14వ సీజన్లో కూడా సిరీజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరి ఇంగ్లండ్ పర్యటనలో ఎలా రాణిస్తాడో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -